
- అంబేద్కర్ ఓవర్సిస్ స్కాలర్ షిప్లో ఎస్టీలకు రిజర్వేషన్స్: మంత్రి సీతక్క
- పెసా చట్టాన్ని పక్కాగా అమలు చేస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఏజెన్సీ ఏరియాలో జాబ్ మేళాలను ఏర్పాటు చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. త్వరలో మహబూబాబాద్, ఆసిఫాబాద్లలో జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్లో గిరిజన విద్యార్థులకు 40 నుంచి 50 శాతం రిజర్వేషన్ అమలు చేసేలా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. పెసా నిబంధనలకు విరుద్ధంగా తీసుకొచ్చిన జీవో 49ని ఉపసంహరించుకోవాలని వస్తున్న డిమాండ్ ను సీఎం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మంగళవారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని సంక్షేమ భవన్ లో గిరిజన ఎమ్మెల్యేలు, అధికారులతో సీతక్క సమావేశమయ్యారు. అటవీ అధికారులు పెసా చట్టాలను ఉల్లంఘిస్తున్నారని మంత్రి సీతక్క ఎదుట గిరిజన ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రామసభల అనుమతి లేకుండానే ఫారెస్ట్ ఏరియా పేరుతో గిరిజనుల భూములను స్వాధీనం చేసుకుంటున్నారని వివరించారు. దీనిని అడ్డుకోవాలని కోరారు. మంత్రి సీతక్క స్పందిస్తూ.. పెసా నిబంధనలకు విరుద్ధంగా అటవీ శాఖ తీసుకొచ్చిన జీవో 49ను వెనక్కి తీసుకోవాలని సీఎంను కోరతానన్నారు.
ఉట్నూరు, ఏటూరునాగారం ఐటీడీఏల అభివృద్ధి కోసం రూ. 12 కోట్లు ప్రత్యేకంగా కేటాయించామని తెలిపారు. కాగా.. మసాబ్ ట్యాంక్లోని సంక్షేమ భవన్లో ఏర్పాటు చేసిన ట్రైబల్ కెఫ్ టేరియాను మంత్రి సీతక్క ప్రారంభించారు. గిరిజన తెగలకు సంబంధించి 11 ట్రైబల్ దేవాలయాలను దర్శించుకున్నారు. అటవీ ఉత్పత్తులతో తయారైన పలు ఆహార పదార్థాలను ఆమె రుచి చూశారు. తెలంగాణ గిరిజన సంస్కృతిని పరిరక్షించడంలో భాగంగానే హైదరాబాద్లో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేశామన్నారు.
అనంతరం.. ఆమె బేగంపేటలోని టూరిజం ప్లాజాలో సదరం ధ్రువీకరణ పత్రాల కోసం వైకల్య గుర్తింపుపై డాక్టర్ల కోసం నిర్వహించిన వర్క్ షాప్లో పాల్గొన్నారు. దివ్యాంగుల పరికరాల కోసం ప్రతి ఏడాది రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా.. 12న బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అవగాహన కార్యక్రమాలను ప్రారంభించింది. దీనికి సంబంధించిన పోస్టర్ను మాసబ్ ట్యాంక్ లోని డీసీసీ భవన్ లో మంత్రి సీతక్క రిలీజ్ చేశారు.